కరోనా వచ్చినా ప్రపంచ కప్ మ్యాచ్ లు ఆడొచ్చు: ఐసీసీ, ఆస్ట్రేలియా ప్రకటన

  • వరల్డ్‌కప్‌ టీమ్స్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టని ఐసీసీ, ఆసీస్‌ ప్రభుత్వం
  • వ్యాక్సిన్ తీసుకోలేదని ఈ ఏడాది ఆరంభంలో టెన్నిస్ స్టార్ జొకోవిచ్ ను దేశంలోకి అనుమతించని ఆస్ట్రేలియా
  • తాజాగా కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తి వేసిన ప్రభుత్వం 
టీ20 ప్రపంచ కప్‌ కోసం ఆస్ట్రేలియా వచ్చిన వివిధ జట్ల ఆటగాళ్లు, సిబ్బందికి అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ), ఆస్ట్రేలియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా క్రికెటర్లు కరోనా పాజిటివ్‌గా తేలినా కూడా తమ జట్లతో కలిసి ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడొచ్చు. ఆస్ట్రేలియాలో ఉన్నన్ని రోజులు కరోనా టెస్టులు కూడా చేయించుకోవాల్సిన అసవరం లేదు. ఈ మేరకు ఐసీసీ, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ టోర్నీలో పాల్గొనేవాళ్లకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దాంతో, కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా జరుగుతున్న పెద్ద టోర్నమెంట్ ఇదే కానుంది.

ఈ ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్‌ వేసుకోని కారణంగా సెర్బియా టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ను తమ దేశంలో ఆడకుండా బయటికి పంపించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పుడు ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దాంతో, టోర్నీ నిర్వహణ ఐసీసీకి మరింత సులువు కాగా.. మొన్నటిదాకా కఠినమైన బయో బబుల్స్‌లో ఉన్న ఆటగాళ్లకు ఎంతో ఊపశమనం కలిగింది. కరోనా సంక్షోభ సమయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. 

అయితే, తమ దేశం వచ్చే వాళ్లు ముందుగా ఐసోలేషన్‌లో ఉండాలన్న నిబంధనను గత వారం ప్రభుత్వం ఎత్తేసింది. ‘ఒకవేళ ఆటగాడు కరోనా బారిన పడినప్పటికీ తను బాగానే ఉంటే మ్యాచ్‌ ఆడొచ్చు. వైద్య బృందాన్ని సంప్రదించిన తర్వాత అతనికి అనుమతి లభిస్తుంది. కాకపోతే వైరస్‌ బారిన ప్లేయర్లు మాస్కులు ధరించడం, తోటి ఆటగాళ్లకు దూరంగా ఉండటం వంటి సూచనలు పాటించాల్సి ఉంటుంది’ అని ఐసీసీ వర్గాలు తెలిపాయి.

T20 World Cup
Corona Virus
positive
players
matches
no ristrictions
Australia

More Telugu News